తనకు అగ్ర కథానాయకుడు పవన్కల్యాణ్ అంటే చాలా ఇష్టమని నటి మాధవిలత అన్నారు. అంతేకాదు జనసేన పార్టీతో కలిసి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ఆమె ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు.‘నాకు పవన్కల్యాణ్ అంటే ప్రేమని గత పదేళ్లుగా ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను. నాకు ప్రజాసేవ అంటే చాలా ఇష్టం. అందుకే ‘నక్షత్ర ఫౌండేషన్స్’ను ప్రారంభించా. కానీ మద్దతుగా నిలిచేవారు, విరాళాలు ఇచ్చేవారు లేక సేవకు బ్రేక్ ఇచ్చాను. కానీ సేవ చేయాలనే ఆశ చావలేదు. ఆలోచించా.. పవన్ అంటే నాకు అంత ఇష్టం ఉన్నప్పుడు.. ఒక వ్యక్తిగా ఆయన ‘జనసేన’ పెట్టినప్పుడు.. నేను ఎందుకు మద్దతు ఇవ్వకూడదు. పవన్కల్యాణ్ కోసం నేను దేనికైనా రెడీ’ అని ఆమె పోస్ట్లో పేర్కొన్నారు.
మాధవిలత ‘నచ్చావులే’ సినిమాతో కథానాయికగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘స్నేహితుడు’తో విజయం అందుకున్నారు. ‘అరవింద్ 2’, ‘ఉసురు’ తదితర చిత్రాల్లో కనిపించారు. చిత్ర పరిశ్రమలో తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని, వీటిని అడ్డుకున్నందుకు అవకాశాలు తగ్గిపోయాయని ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.