ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న‌టి అమ‌లాపాల్‌పై ఛార్జిషీట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 19, 2018, 11:48 AM



ప్రముఖ నటుడు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సురేష్ గోపీ, నటి అమలా పాల్‌పై చార్జిషీట్ నమోదు చేసేందుకు కేరళ పోలీసులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఖరీదైన కార్లు కొనుగోలు చేసిన ఈ ఇద్దరు సినీ ప్రముఖులు తప్పుడు అడ్రస్‌ల పేరిట పుదుచ్చేరిలో కార్ల రిజిస్ట్రేషన్ చేయించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ఎగ్గొట్టారనే నేరం కింద కేరళ పోలీసులు వీళ్లిద్దరిపై మరో నెల రోజుల్లో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. గతంలో ఇదే కేసులో కోర్టు ధిక్కారానికి పాల్పడి, కోర్టు ఆగ్రహానికి గురైన అమలాపాల్ ఆ తర్వాత కోర్టులో లొంగిపోయి, వెంటనే బెయిల్‌పై బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే ఈ ఇద్దరు పన్ను ఎగవేతదారులపై ఛార్జ్‌షీట్‌ నమోదు చేయాల్సిందిగా కేరళ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు చట్టరీత్యా చర్యలకు ఉపక్రమిస్తున్నట్టు సమాచారం. 


ది వీక్ ఆన్ లైన్ మేగజైన్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం ప్రముఖ యువ నటుడు ఫహద్ ఫాసిల్ సైతం ఇదే తరహాలో పన్ను ఎగవేతకు పాల్పడినట్టుగా రుజువైనప్పటికీ, ఆ తర్వాత అతడు తన నేరాన్ని అంగీకరించి రూ.17.68 లక్షల జరిమానా చెల్లించడంతో ఆ కేసులో అతడిపై పేరుని కొట్టేసినట్టు తెలుస్తోంది. అయితే, అదే సమయంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న అమలాపాల్, సురేష్ గోపీ జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా లేకపోవడం వల్లే కేరళ ప్రభుత్వం వారిపై కఠిన చర్యలకు పూనుకుంటున్నట్టు సమాచారం. 


ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న త‌ప్పుడు అడ్ర‌స్ చూపి అమలాపాల్ రూ.20 లక్షల పన్ను ఎగ్గొట్టగా, సురేష్ గోపీ రెండు కార్లు పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా కోట్ల‌లో పన్ను ఎగ్గొట్టినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన సురేష్ గోపీకి ఇద్దరు పూచీకత్తు ఇవ్వడంతోపాటు రూ. 1 లక్ష నగదు బాండ్ సమర్పించడంతో అతడు పోలీసుల చెర నుంచి వెంటనే బయటికొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com