కరోనా వైరస్ విరుచుకు పడటంతో దేశం అతలాకుతలమవుతోంది. ప్రజలంతా భయాందోళనలతో ఇళ్లకి పరిమితమయ్యారు. బయటికి వెళితే తప్ప కొందరిది ఇల్లు గడవని పరిస్థితి. అలా అని చెప్పేసి బయటికి వెళ్లలేని పరిస్థితి. దాంతో చాలామంది రోజులను చాలా భారంగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఒక వైపున కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే, మరో వైపున ఆర్థికంగా ప్రజలను ఆదుకోవడానికి గాను అనేక ప్రణాళికలను చేపడుతున్నాయి.ఈ విపత్తును ఎదుర్కోవడానికిగాను తమవంతు సాయాన్ని అందిస్తామంటూ టాలీవుడ్ సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలు .. దర్శకులు తమ విరాళాలను సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తాజాగా ఆ జాబితాలో కొరటాల శివ .. అనిల్ రావిపూడి కూడా చేరిపోయారు. ఈ ఇద్దరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి 10 లక్షల రూపాయలను ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు.