నూటొక్క జిల్లాల అందగాడుగా ప్రసిద్ధి చెందిన నూతన్ ప్రసాద్ అసలు పేరు తాడినాడ వరప్రసాద్. ఆయన 1945వ సంవత్సరం డిసెంబర్ 12న కైకలూరులో జన్మించారు. హెచ్ఏఎల్ లో ఉద్యోగం చేస్తున్న సమయంలో రంగస్థల నటుడు, దర్శకుడైన భాను ప్రకాష్ ఆయనకు పరిచయం అయ్యారు. భాను ప్రకాష్ స్థాపించిన ‘కళారాధన’ సంస్థ తరపున ప్రదర్శించిన వలయం, గాలివాన, కెరటాలు వంటి నాటకాల ద్వారా నూతన్ ప్రసాద్ నాటకరంగంలో ప్రసిద్ధి చెందారు.1973లో అందాల రాముడు చిత్రంతో నూతన్ ప్రసాద్ సినీరంగ ప్రవేశం చేశారు. ఆయన తన సుదీర్ఘ సినీప్రస్థానంలో 350కి పైగా చిత్రాల్లో నటించారు. ముత్యాలముగ్గు, ఖైదీ, రాజాధిరాజు, మగమహారాజు, శ్రీవారికి ప్రేమలేఖ, మగధీరుడు, బామ్మమాట బంగారుబాట, కథానాయకుడు, పట్నం వచ్చిన పతివ్రతలు, అహ! నా పెళ్ళంటా!, మాస్టర్ చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. బామ్మమాట బంగారుబాట చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదం కారణంగా కాళ్లు అచేతనావస్థలో ఉండిపోయిన కారణంగా పరిమితమైన పాత్రలనే చేశారు. ‘దేశం చాలా క్లిష్టపరిస్థితిలో ఉంది’, ‘నూటొక్క జిల్లాల అందగాడిని’ అని ఆయన చెప్పిన డైలాగులు ప్రేక్షకాదరణ పొందాయి. ఈటీవీ-2లో ప్రసారమైన నేరాలు ఘోరాలు అంత జనాదరణ పొందడానికి కారణం ఆయనే అంటే అతిశయోక్తి కాదు. ఆయన 2011వ సంవత్సరం మార్చి 30న తుదిశ్వాస విడిచారు.