సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు సైతం సోషల్ మీడియాలో లైంగిక వేధింపులు తప్పడం లేదు. తాజాగా ఓ ప్రముఖ మహిళా కమెడియన్ లైంగిక వేధింపులకు గురయ్యారు. వివరాల ప్రకారం.. ముంబైకు చెందిన స్టాండప్ కమెడియన్ అగ్రిమా జాషువా 2019లో మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతున్న ఛత్రపతి శివాజీ విగ్రహం గురించి వీడియోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది జరిగి ఏడాది అయ్యింది. అయితే ఇప్పుడు కొందరు ఇప్పుడు అదే విషయంపై ఆమెపై విమర్శల దాడికి దిగారు. మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీని అగ్రిమా అగౌరవపరించిందని కొందరు నెటిజన్లు తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ క్రమంలో వడోదరకు చెందిన శుభం మిశ్రా అనే వ్యక్తి అగ్రిమాపై తీవ్ర అసభ్య పదజాలంతో దూషించాడు. ఛత్రపతి శివాజీ గురించి అగ్రిమా మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆమెను లైంగిక వేధింపులతో బెదిరించాడు. ఈ మేరకు మిశ్రా శనివారం ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను కూడా పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్ నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. నిందితుడు మిశ్రాపై వడోదర పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకుంటామని గుజరాత్ డీజీపీ శివానందర్ ట్విటర్లో పేర్కొన్నారు. మరోవైపు కమెడియన్ జాషువా సైతం చత్రపతి శివాజీ అనుచరుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆమె క్షమాపణలు కోరారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ఆమె డిలీట్ చేశారు.