టచ్ చేసి చూడు' సినిమాలో రవితేజకు జోడీగా నటించిన సీరత్ కపూర్ కి మళ్లీ రవితేజ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. 'రన్ రాజా రన్' చిత్రంతో టాలీవుడ్ ప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత 'టైగర్', 'కొలంబస్', 'ఒక్క క్షణం', 'టచ్ చేసి చూడు', 'కృష్ణా అండ్ హిజ్ లీల'.. వంటి కొన్ని సినిమాలలో నటించినప్పటికీ, హీరోయిన్ గా ఇంకా పెద్ద బ్రేక్ మాత్రం రాలేదు.ఈ క్రమంలో రవితేజ హీరోగా నటించే సినిమాలో సీరత్ కు మళ్లీ హీరోయిన్ గా అవకాశం రావడం లక్కీ అనే చెప్పాలి. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రాన్ని ఒప్పుకున్నాడు. దీనికి 'ఖిలాడి' అనే టైటిల్ని కూడా నిర్ణయించినట్టు వార్తలొచ్చాయి. ఇప్పుడీ చిత్రంలో సీరత్ కపూర్ ని ఓ కథానాయికగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తాను చేస్తున్న 'క్రాక్' సినిమా పూర్తయ్యాక ఈ కొత్త చిత్రాన్ని రవితేజ ప్రారంభిస్తాడు.