ప్రైవేట్ పాఠశాలల దోపిడీతో విద్యార్థుల తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. ఆన్ లైన్ క్లాసులు జరుగుతున్న తరుణంలో సైతం పూర్తి ఫీజుల కోసం పాఠశాలల యాజమాన్యాలు వేధిస్తున్నాయి. ఇదే అనుభవం సినీనటుడు శివబాలాజీకి సైతం ఎదురైంది. ఫీజు కోసం మౌంట్ లిటేరా జీ స్కూల్ యాజమాన్యం వేధిస్తోందని ఆయన తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.ఫీజులు తగ్గించాలని అడిగితే తన కుమారుడిని ఆన్ లైన్ క్లాసుల నుంచి అర్ధాంతరంగా తొలగించారని ఫిర్యాదులో శివబాలాజీ పేర్కొన్నారు. చాలా మంది తల్లిదండ్రులను ఇలాగే ఇబ్బంది పెడుతున్నారని... అయితే వారు బయటకు చెప్పుకోవడానికి భయపడుతున్నారని తెలిపారు. శివబాలాజీ ఫిర్యాదుపై మానవహక్కుల కమిషన్ స్పందించింది. సదరు పాఠశాలపై సమగ్ర విచారణ జరిపి, రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని డీఈఓకి నోటీసులు పంపింది.