బాధ్యతగా ఉండాల్సిన సినీ నటుడు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోవిడ్19 నిబంధనలు ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు సాధన స్రవంతి ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్ స్టేషన్లో నటుడు అల్లు అర్జున్పై చర్యలు తీసుకోవాలని బుధవారం ఫిర్యాదు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రస్తుతం కుంటాల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేశారని, అయినా అల్లు అర్జున్, ఆయన ఫ్యామిలీతో పాటు లేటెస్ట్ మూవీ పుష్ప యూనిట్ సభ్యులు కొందరు కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తిప్పేశ్వర్లో అనుమతులు లేకున్నా పుష్ప సినిమా షూటింగ్ చేశారని సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవులపల్లి కార్తిక్రాజు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన నేరడిగొండ పోలీసులు, దీనిపై ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేయాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఆదిలాబాద్ డీఎఫ్ఓకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా సంబంధిత అధికారి అందుబాటులో లేకపోవడంతో ఆఫీసు సిబ్బందికి వినతిపత్రం అందజేసినట్లు సమాచారం. మరోవైపు కుంటాల జలపాతానికి ఇటీవల అల్లు అర్జున్ వెళ్లడంతో భారీగా అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. బన్నీ కుంటాల సందర్శన ఫొటోలు వైరల్ అయ్యాయి.