దివంగత గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం.. ఆయన పేరుపై ఎస్.పి.బి డబ్బింగ్ స్టూడియోను సీనియర్ నటుడు దక్షిణాది సినీ, టెలివిజన్ ఆర్టిస్టుల యూనియన్ అధ్యక్షుడు రాధారవి చెన్నైలో ప్రారంభించారు. కోవిడ్ కారణంగా బాలసుబ్రహ్మణ్యం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణించిన వారం రోజులకు ఎస్.పి.బి పేరుపై ఓ డబ్బింగ్ స్టూడియోను ప్రారంభిస్తామని రాధారవి అనౌన్స్ చేశారు. అన్నట్లుగానే రెండు నెలల్లోనే ఎస్.పి.బి పేరుతో డబ్బింగ్ స్టూడియో ప్రారంభించడంపై యూనియన్ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడటమే కాకుండా, పలు సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. రజినీకాంత్, కమల్హాసన్, అనీల్ కపూర్, విష్ణువర్ధన్, సల్మాన్ఖాన్, మోహన్, అర్జున్, జెమినీ గణేశన్ తదితరులకు బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పారు.