సంక్రాంతి బరిలో దిగిన చిత్రాల్లో మాస్ మహరాజా రవితేజ 'క్రాక్' మూవీ ప్రథమస్థానంలో నిలిచింది. మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా దర్శకుడు మలినేని గోపీచంద్ దీనిని తెరకెక్కించిన విధానం జనాలకు నచ్చింది. యాభై శాతం ఆక్యుపెన్సీతో కూడా 'క్రాక్' చక్కని కలెక్షన్లను రాబడుతోంది. అయితే... ఈ సినిమా విడుదలకు ముందే జనవరి 29న 'ఆహా'లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ జరిపేందుకు అగ్రిమెంట్ రాసుకున్నారు నిర్మాతలు. కానీ ఇప్పుడు సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమౌతున్న నేపథ్యంలో నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. ఓటీటీ ప్లాట్ ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ అయితే... ఈ ఊపు తగ్గుతుంది. అది సినిమా థియేట్రికల్ కలెక్షన్ల మీద కూడా ప్రభావం చూపుతుంది. దాంతో ఆహా యాజమాన్యానికి తమ మనసులోని మాటను తెలిపారు. దాంతో ఆ సంస్థ సైతం సానుకూలంగా స్పందించింది. 'చిత్రసీమలో భాగమైన తాము అన్ని రకాలుగా సినిమా ను నిలబెట్టడం కోసం ప్రయత్నిస్తామని, అందుకే జనవరి 29న స్ట్రీమింగ్ జరపాల్సిన 'క్రాక్'ను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేశామ'ని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ నిర్ణయంతో ఆహా సబ్ స్క్రైబర్స్ కాస్తంత నిరాశకు గురైనా... 'క్రాక్' దర్శక నిర్మాతలకు ఇది శుభవార్తగా పరిణమించింది!