టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ తన ఉదారతను చాటుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తున్న వేళ మానవత్వంతో ముందుకు వచ్చారు. అనాథ పిల్లలను ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కరోనా కారణంగా సంరక్షణ కోల్పోయిన అనాథ చిన్నారుల వివరాలను తనకు పంపాలని అన్నారు. వారికి తన ద్వారా తోచినంత సహాయం అందిస్తానని తెలిపారు. ఆ చిన్నారులకు రెండేళ్ల పాటు మంచి ఆహారం అందించడంతో పాటు వారిని చదివిస్తానని ప్రకటించారు. చిన్నారులు వివరాలను sundeepkishancovidhelp@gmail.com మెయిల్ అడ్రస్ కు పంపాలని సూచించారు. ఇది ఒకరికి ఒకరు అండగా నిలవాల్సిన సమయం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.