రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ ఓ ట్వీట్ పెట్టారు. 'ప్రతి ఒక్కరికీ రంజాన్ శుభాకాంక్షలు. నా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తున్న మీకు, మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నాను. త్వరలోనే కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని, ఆరోగ్యవంతుడిగా మీ ముందుకు వస్తా. సురక్షితంగా ఉండండి. జాగ్రత్తలు పాటించండి' అని ఎన్టీఆర్ ట్వీట్ పెట్టారు. ఈ నెల 10న ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డారు. హోమ్ ఐసోలేషన్లో ఉంటూ వైద్యుల సూచనలు పాటిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు తారక్ కొవిడ్-19 బారిన పడ్డారని తెలుసుకున్న అభిమానులు ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ పలు ఆలయాల్లో పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.