టాలీవుడ్ యువనటుడు అడివి శేష్ అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల డెంగ్యూ బారిన పడిన ఆయన రక్తంలో ప్లేట్లేట్స్ పడిపోయాయి. దీంతో ఆయన సెప్టెంబర్ 18న ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని తాజాగా ఆయన టీమ్ వెల్లడించింది. ప్రస్తుతం శేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని వారు తెలిపారు. డాక్టర్లు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఆయన త్వరితగతిన కోలుకోవాలంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు. క్షణం, గూఢచారి, ఎవరు వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన శేష్ ప్రస్తుతం ‘మేజర్’ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘మేజర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శశికిరణ్ తిక్కా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు ‘హిట్-2’ సినిమాలోనూ శేష్ నటిస్తున్నారు.