సంక్రాంతి బరిలో రామ్ చరణ్ నటించిన `వినయ విధేయ రామ` రిలీజైన సంగతి తెలిసిందే. మూడు సినిమాలతో పోటీపడుతూ చరణ్ సినిమా పండగ సెలవుల్ని బాగానే పిండుకుంది. ఈ సినిమాకి క్రిటిక్స్ నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అయితే తొలి వారాంతం నాటికి కేవలం 55 శాతం షేర్ మాత్రమే దక్కింది. సాధించాల్సిన టార్గెట్ ఇంకా పెద్దదే ఉందని ట్రేడ్ రిపోర్ట్ చెబుతోంది.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల నుంచి ఎనిమిది రోజుల్లో 52 కోట్ల షేర్.. ఇతర చోట్ల నుంచి 6కోట్ల మేర షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ 60కోట్ల షేర్ వసూలైంది. నైజాం 12.15కోట్లు - సీడెడ్ -11.32కోట్లు - వైజాగ్- 7.28 కోట్లు తో విధేయ రాముని కొంతమేర ఆదుకున్నాయి. దాదాపు 90 కోట్లు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం మరో 30 కోట్లు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సోమవారం నుంచి విధేయ రామునికి అసలు పరీక్ష ఎదురు కానుంది. పెండింగ్ వసూళ్లను తెస్తుందా లేదా? రెండో వారంలో డ్రాపవుతుందా.. అంటూ ఆసక్తికర చర్చ సాగుతోంది. సెలవుల్లో రిలీజ్ చేసి బాగానే వసూళ్లు తెచ్చినా రంగస్థలం లాంటి గొప్ప సినిమాలో నటించిన చరణ్ ఇలాంటి(వినయ విధేయ రామ) లాజిక్ లేని కాన్సెప్టుల్ని ఎంచుకోకూడదని అభిమానులే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. బోయపాటికి ట్రోలింగ్స్ తప్పడం లేదు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలోని ఆర్.ఆర్.ఆర్ పై రామ్ చరణ్ పూర్తిగా శ్రద్ధ పెడుతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం చరణ్ ప్రత్యేకించి కోచ్ సమక్షంలో శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే బాలయ్య తో తదుపరి సినిమా స్క్రిప్టును ఫైనల్ చేసేందుకు బోయపాటి కుస్తీలు పడుతున్నారట.