సంగీత దర్శకుడు కోటి నటుడిగా మారారు. దేవినేని సినిమాలో ఐపీఎస్ అధికారి కె.ఎస్.వ్యాస్ పాత్రలో నటిస్తున్నారు. దేవినేని నెహ్రూ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రానికి నర్రా శివనాగేశ్వరరావు దర్శకుడు. నందమూరి తారకరత్న టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. రామురాథోడ్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ నా సెకండ్ ఇన్నింగ్స్ ఇది. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాను. మా నాన్న నన్ను ఐపీఎస్ ఆఫీసర్గా చూడాలని అనుకున్నారు. అది గుర్తొచ్చే ఈ సినిమా అంగీకరించాను అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ 75 శాతం షూటింగ్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్లో పతాక ఘట్టాల్ని చిలకలూరిపేటలో తెరకెక్కించనున్నాం అని తెలిపారు. బెజవాడకు చెందిన ఇద్దరు మహానాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు 1977లో కాలం నాటి వాస్తవిక సంఘటనల్ని ప్రతిబింబిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, అన్ని వర్గాలకు కనెక్ట్ అవుతుందని నిర్మాత పేర్కొన్నారు.