బాహుబలి 2 లాంటి భారీ చిత్రం తరువాత హీరో దగ్గుపాటి రానా యూత్ ఫుల్ డైరెక్టర్ తేజ తో స్వంత బ్యానర్ లో చేస్తున్న చిత్రం నేనే రాజు నేనే మంత్రి ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా రానా మీడియాతో ముఖాముఖిలో పాల్గొన్నారు..
ప్ర: తేజా దర్శకత్వం ఎలా అనిపించింది?
జ: ఉన్నదీ ఉన్నట్టుగా చెప్పాలంటే ఈ కథని, పాత్రల్ని ఆయనకన్నా ఎవరూ గొప్పగా రాయలేరు. ఎందుకంటే ఆయన నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే ఆయన కథని రాశారు కాబట్టి.
ప్ర: ఈ సినిమా ఎలా ఉండబోతోంది ?
జ: ఇదొక కొత్త జానర్ సినిమా. పాత్ర తత్త్వం కూడా కొత్తగానే ఉంటుంది. వాటితో పాటే కమర్షియల్ అంశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.
ప్ర: మీరు ఈ సినిమా కోసం ప్రమోషన్లు ఎక్కువగా చేస్తున్నారు కారణం?
జ: జనాలకు నా సినిమా ఫలానా రోజు వస్తుందని తెలియాలి. రిలీజ్ డేట్ ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండాలి. అందుకే ఇంతలా ప్రమోషన్లు చేస్తున్నాను.
ప్ర: మీ పాత్ర ఎలా ఉండబోతోందో చెప్పండి?
జ: ఇందులో నాది వడ్డీ వ్యాపారం చేసుకునే వ్యక్తి పాత్ర. అతనికో భార్య, మావయ్య. అదే అతని లోకం. అలాంటి వ్యక్తి కొన్ని కారణాల వలన కోపంతో రాజకీయాల్లోకి వస్తాడు. రాజకీయ అంటే ఏంటో సరిగా తెలియని అతను ఎలాంటి తప్పులు చేశాడు, ఎలాంటి ఒప్పులు చేశాడు అనేదే సినిమా.
ప్ర: కాజల్ తో పనిచేయడం ఎలా ఉంది ?
జ: సినిమా చేద్దామని అనుకోగానే మా ఫస్ట్ చాయిస్ ఆమే. ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఆమె చుట్టూనే కథ తిరుగుతుంది. సినిమాలో జోగేంద్ర ఎలాంటి పనిచేసిన అది రాధ కోసమే చేస్తాడు.
ప్ర: ఇందులో మీ ఇద్దరి ట్రాక్ ఎలా ఉంటుంది ?
జ: సినిమాలో పాలిటిక్స్ అనేవి సెకండాఫ్లో వస్తాయి. మిగతా అంతా నాకు, కాజల్ కు మధ్యే జరుగుతుంది.
ప్ర: మీ సొంత బ్యానర్ లో చేయడం ఎలా ఉంది ?
జ: చాలా ఆనందంగా ఉంది. నాకు, నాన్నకు, వెంకటేష్ గారికి అందరికీ ఒకేసారి నచ్చిన కథ ఇది. ఇన్నాళ్లు కమర్షియల్ స్ట్రీమ్ సినిమాల్ని మాత్రమే చేసిన ఈ సంస్థ నా వలన మొదటిసారి ప్రయోగాత్మకమైన చిత్రం చేస్తోంది.
ప్ర: రేపటి మూడు సినిమా పోటీ గురించి ఏమంటారు ?
జ: ఖచ్చితంగా నాలాంటి సినిమా అయితే ఎవరూ తీయరు. కాబట్టి నాకెలాంటి భయం లేదు. అలాగే ఈ మూడు సినిమాలు భిన్నమైన జోనర్స్ కు చెందినవి. కాబట్టి అన్నీ ఆడుతాయి. పైగా లాంగ్ వీకెండ్ కూడా ఉంది. వసూళ్లు కూడా బాగుంటాయి అని నాఫీలింగ్ అని ముగించారు.