అమ్మాయి అమ్మ అయినపుడే ఆడపిల్ల జీవితానికి అర్థం అంటారు పెద్దలు. అందుకే అమ్మతనం కోసం ఆడవాళ్లంతా ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంటారు. పెళ్ళైన వెంటనే అందర్నీ అడిగే ప్రశ్న కూడా ఒక్కటే.. పిల్లలెప్పుడు.. ఏదైనా గుడ్ న్యూస్ చెబుతున్నారా లేదా అంటూ ఒకటే ప్రశ్నలు అడుగుతుంటారు. మన దేశంలో ఇది చాలా కామన్ క్వశ్చన్. పెళ్లి తర్వాత వెంటనే పిల్లల టాపిక్ వస్తుంటుంది. అయితే ఓ జంట మాత్రం తమకు అసలు పిల్లలే వద్దు.. వాళ్లు పుడితే లైఫ్లో అసలు థ్రిల్ ఉండదంటున్నారు.
అందుకే తమకు జీవితంలో పిల్లలు వద్దనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ అంత విచిత్రంగా ఆలోచించిన వాళ్లెవరూ అనుకుంటున్నారా.. మన దగ్గర మాత్రం కాదులెండీ.. ఎక్కడో హిందీ సీరియల్స్ చేస్తూ అక్కడ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న కవితా కౌశిక్ అనే నటి తీసుకున్న నిర్ణయం ఇది. ఈమె తీసుకున్న నిర్ణయం విని అంతా షాకవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ముంబైలో బాగా ఫేమస్. సోనీ టీవీలో వచ్చే ఎఫ్ఐఆర్ కార్యక్రమంతో ప్రేక్షకులకు చేరువైంది కవితా కౌశిక్.
ఈ మధ్యే తను ప్రేమించిన రోనిత్ బిశ్వాస్ను రెండేళ్ల కింద పెళ్లి చేసుకుంది. ఇన్నేళ్లైనా ఇంకా విశేషం లేదా అంటే జీవితంలో తాము పిల్లలే కనకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సంచలన నిజం బయటపెట్టింది కవిత. ఎందుకు తాను ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో కూడా చెప్పింది ఈ భామ. ఒకవేళ పిల్లలు పుడితే లైఫ్ సరిగ్గా ఎంజాయ్ చేయలేమని చెబుతుంది కవిత. పైగా తామిద్దరం ఇప్పుడు 40కి చేరువలో ఉన్నామని.. ఇప్పుడు పిల్లల అవసరం లేదనిపిస్తుందని చెబుతుంది కవిత.
తాము పిల్లలను కంటే వాళ్లకు 20 వచ్చే సరికి తాము 60ల్లో ఉంటామని.. అప్పటికి వాళ్లు తమ పనులు వదిలేసి మమ్మల్ని చూసుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళు యవ్వనంలో చేయాల్సిన ఎంజాయ్ మెంట్ కూడా చేయకుండా తమ కోసం ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది. అందుకే అప్పుడు వాళ్లను కష్టపెట్టేకంటే ఇప్పుడు తామే ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంటే మంచిదంటుంది కవిత కౌశిక్. మొత్తానికి ఈమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి ఈ నిర్ణయానికి ఎంతమంది సపోర్ట్ చేస్తారో చూడాలిక.